Wednesday, December 1, 2010

చదువుల్నిచ్చెడు, వాణినే గొలుతు, నా సర్వస్వ మర్పించుచున్ !!!!!

దియా గౌతమి తీరమందు వెలిసెన్ నవ్య ప్రభల్ జిమ్ముచున్ ,
నదియే బాసర! వాసియై భువికి కి యానందమ్ము జేకూర్చగా,
హృదిలో భక్తిసరాగముల్ గలుగ యా యుల్లాస హాసాన యా
చదువుల్నిచ్చెడు, వాణినే గొలుతు, నా సర్వస్వ మర్పించుచున్ !

(శకరాభరణం బ్లాగులో(13-10 -2010) దత్తపది-8 లో యిచ్చిన "నయా, కియా,దియా,గయా  ."పదాల నుపయోగించి
ఏ వృత్తములో నైనా ఇష్టదేవతా  ప్రార్థన జేయవచ్చునన్న దత్తపది కి స్పందించి వ్రాసిన పద్యం )    

3 comments:

  1. అంతా బాగానే వుంది కానీ ..... 'తనకు ' శబ్దం శాస్త్ర సమ్మతం....'తనకి ' గ్రామ్యం...!!!!.. 'గలుగ యా' వ్యాకరణ సమ్మతమూ కాదు ఎందుకంటే " కలుగన్ " ద్రుతాంతమే కాబట్టి యడాగమం రాదు.... ఇవి రెండూ మినహా పద్యం నడక సొగసు గా ఉంది....!!!!

    " వినయాంభోధి తరంగ శీకరములావేశించి హృద్వీధిలో
    వనమాలాంకిత వేంకటేశునికి యావచ్ఛక్తి సంప్రీతి పూ
    జనముల్ సేయుచు చందనమ్మలది యా సన్మంగళాకారు నే
    ననయంబున్ స్తుతియింతు నిక్కముగ !యాజ్యంబౌను తల్లీలలున్ !!!!

    ReplyDelete
  2. అజ్ఞాత గారు,నమస్కారం.
    మీ వ్యాఖ్యను నేడు చూశాను.నా బ్లాగును వీక్షించి,స్పందించి నందులకు మీకు కృతఙ్ఞతలు.శ్రీ శంకరయ్య గారు కొన్ని,చిన్న ,చిన్న దోషాలున్నాయని లోగడే అన్నారు.నాకూ అలానే అనిపించింది.
    కాని అవియేవో తెలియలేదు.నేను పద్యాలు వ్రాయడం క్రొత్త .గత రెండు, మూడు మాసములనుండే వ్రాస్తున్నాను.తెలిసింది పిసరంత,తెలుసుకో వలసింది కొండంత.వ్రాస్తే దోష రహితంగానే వ్రాయాలి.అదే అభిలషణీయం కూడా.నన్ను నేను మెరుగు పరుచు కుంటూ ముందు కెళ్లడానికి ప్రయత్నిస్తాను.లోపాలను తెలియ జేసినందులకు ధన్య వాదములు.
    మీ పూరణ చాలా బాగుంది. ,పదాలు పద్యం లో అందంగా ఒదిగిపోయి,మంచి ధారా శుద్దితో,భావ స్పోరకంగా, హృదయంగమంగా
    మరియు అద్భుతంగా ఉంది.మీకు అభినందనలు.

    ReplyDelete
  3. ధన్యవాదాలు......రెండు మూడు నెలలలోనే పద్యాల సొగసును, నడకలో తూగును గ్రహించినందులకు అభినందనలు!!!!! సాధనమున పనులు సమకూరు ధరలోన!!!! మీ ప్రయత్నాన్ని మనసారా అభినందిస్తూ .... విజయవంతం కావాలని ఆశిస్తూ !!!!

    ReplyDelete